బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (15:22 IST)

కృష్ణజింక కేసులో బాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు

అప్పుడెప్పుడో ముగిసిపోయిందనుకున్న కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్లకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. 1998 సెప్టెంబర్‌లో ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సందర్భంగా.. కంకానీ గ్రామంలో కృష్ణ జింకలను వేటాడి.. రెండింటిని చంపారంటూ సల్మాన్ ఖాన్, సోనాలీ బింద్రే, నీలమ్, టాబు, దుష్యంత్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చాయి.
 
దీనిపై అదే యేడాది అక్టోబరు నెలలో బిష్ణోయి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక కోర్టు ఈ కేసు విషయమై గత యేడాది సల్మాన్ దోషిగా నిర్ధారించి మిగిలినవారిని నిర్దోషులుగా ప్రకటించిన విషయమూ తెల్సిందే. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పిటిషన్ స్వీకరించిన హైకోర్టు.. సోమవారం నోటీసులు జారీ చేసింది.