1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 మే 2023 (12:57 IST)

మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

prk pillai
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత పీకేఆర్ పిళ్లై (92) కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. త్రిశూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హీరో మోహన్ లాల్‌తో కలిసి అధిక చిత్రాలు నిర్మించిన ఘనత పిళ్లైకే దక్కింది.
 
షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానరుపై అమృతం గమ్య, చిత్రం, వందనం, కిళక్కునరుమ్, పక్షి, అహం వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఈయన నిర్మించిన చిత్రాల్లో చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రం 200కు పైగా చిత్రాల్లో 300 రోజుల పాటు ప్రదర్శించబడింది. 
 
ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోకి రీమేక్ చేశారు. తెలుగులో అల్లుడుగారు పేరుతో రీమేక్ చేశారు. 12 సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చి స్థిరపడిన పిళ్లై... 1984లో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సొంత బ్యానరును స్థాపించి దానిపై అనేక చిత్రాలు నిర్మించారు. మొదట ఎర్నాకుళంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన కుటుంబంతో సహా త్రిశూర్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్మ, రాజేష్, ప్రీతి, సోను అనే పిల్లలు ఉన్నారు.