మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (11:53 IST)

భారత్ మరో ఇటలీ కాకూడదు.. సూర్య : స్వీయనిర్బంధంలో బాలీవుడ్ ప్రేమజంట

కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా కేంద్రంతో పాటు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ ఆంక్షలను ప్రతి ఒక్కరూ పాటించాలని తమిళ హీరో సూర్య విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్.. మరో ఇటలీ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమతమ గృహాలకే పరిమితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన ట్విట్టర్ ద్వారా ఓ చిన్నపాటి వీడియోను రిలీజ్ చేశారు. వరదలు, తుఫాన్లు, జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడామని, ప్రస్తుతం కరోనాపై ఇంట్లో ఉండే పోరాడుదామని పిలుపునిచ్చారు. 
 
చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా ప్రాణనష్టం అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు. కరోనా తీవ్రతను గ్రహించకుండా ఇటలీ ప్రజలు బయట తిరగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. భారత్‌ మరో ఇటలీ కాకూడదని సూర్య అభిప్రాయపడ్డారు. 
 
ముఖ్యంగా, ప్రతి పౌరుడూ తమవంతు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని సూర్య కోరారు. ముఖాన్ని చేతులతో ముట్టుకోకూడదని, జ్వరం, దగ్గుతో బాధ పడుతుంటే కరోనా వైరస్‌ సోకినట్లు కాదని, అయినప్పటికీ ఆరు రోజులు ఎవరితోనూ కలవకుండా ఉండాలని, అప్పటికీ సమస్య ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. 
 
స్వీయ నిర్బంధంలో ప్రేమజంట
మరోవైపు, కరోనా వైరస్ దెబ్బకు దేశ వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లన్నీ రద్దు అయ్యాయి. దీంతో సెలెబ్రిటీలు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అలాంటి వారిలో ఓ బాలీవుడ్ ప్రేమజంట కూడా ఉంది. ఆ ప్రేమ జంట ఎవరో కాదు.. మలైకా అలోరా, అర్జున్ కపూర్. గత యేడాది కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమాని ఒకే ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు.