మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (19:33 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన రేణూ దేశాయ్ (video)

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలితో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలను నాటారు హీరోయిన్ రేణు దేశాయ్.
 
ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.... ఇప్పుడు ఉన్న జీవన విధానంలో మనందరం అపార్ట్మెంట్ కల్చర్‌కి అలవాటు పడ్డామని, మన చిన్నతనంలో స్వంత గృహాలలో ఉండటంవల్ల ఆ చుట్టుపక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునేవారమని... కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం లేదన్నారు.
 
కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య మరియు కూతురు స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. వారి వయసు 10 సంవత్సరాలు. వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి? మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి? అనే విషయాన్ని తెలపటం కోసం వాళ్ళిద్దరినీ తీసుకురావడం జరిగిందని చెప్పారు.
ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్నా భవిష్యత్ తరాలకు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాటిన మొక్క ఉపయోగం ఉంటుందని తెలిపారు. దాని ఫలాలు భవిష్యత్ తరాలవారు అందుకుంటారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురుతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ముగ్గురికి చాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని రేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.