శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:57 IST)

ఈటీవీ కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్' నుంచి నాగ‌బాబు, రోజాలు ఔట్..

ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలకు అక్క‌డ ఉన్న యాంక‌ర్‌లతోపాటు అందులో పాల్గోనే పార్టిసిపెంట్స్ ఎంత ముఖ్య‌మో దానికి జడ్జీలుగా వ్యవహరించే రోజా, నాగబాబులు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఇందులో పార్టిసిపెంట్స్ చేసే స్కిట్స్‌తో‌పాటు నాగబాబు, రోజాల ముసిముసి నవ్వులు చూసి ఆడియన్స్ కూడా అదే రేంజ్‌లో ఖుషీ అవుతారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. 
 
స్కిట్‌లో కామెడీ ఉన్నా, లేక‌పోయినా... పడి పడి నవ్వే వాళ్ళ న‌వ్వుల‌కు... ప్రేక్ష‌కులు కూడా అల‌వాటు ప‌డిపోయారు. అలాంటిది వాళ్లు లేని జ‌బ‌ర్ద‌స్త్ అంటే దాదాపు ప్రాణం లేక‌పోవ‌డ‌మే. కానీ ఈ సూపర్‌హిట్ కార్యక్రమాన్ని వీళ్లు ఇద్దరూ ఇప్పుడు ఖచ్చితంగా వ‌దిలేయవలసిన స‌మ‌యం వచ్చేసింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ కూడా 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రత్యక్షంగా బరిలో దిగనుండడం విశేషం. 
 
వీళ్లల్లో... రోజా.. ఇప్పటికే నగరి నుంచి ఎమ్మెల్యేగా ఉంటూనే జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు జడ్జీగా వ్యవహరిస్తూ... ఇపుడు మరోసారి వైకాపా తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. మరోవైపు నాగబాబు కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించేసిన జనసేన తరుపున నర్సాపురం నుండి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. కాగా... పోలింగ్‌‌కు పదిరోజుల మాత్రమే టైమ్ ఉండటం... దానికి రెండు రోజుల ముందే ఎలక్షన్ ప్రచారం ముగించాల్సి ఉండడం... అంటే ఎంత లేదన్నా వీళ్లిద్దరూ ప్రచారం చేసుకోవడానికి మిగిలి ఉన్న సమయం ఒక వారం మాత్రమే.
 
కాగా... ఎన్నికల బరిలో వీళ్లిద్దరికీ కూడా తాము పోటీ చేస్తున్న స్థానాలలో బలమైన ప్రత్యర్థులే ఉన్నారు. దీంతో జబర్థస్త్ ప్రోగ్రామ్‌కు ఇప్పుడు కొత్త జడ్జీలను తీసుకొచ్చారు నిర్వాహకులు. రోజా స్థానంలో మీనా ఒక జడ్జీగా వ్యవహరిస్తూండగా... మరోవైపు నాగబాబు ప్లేస్‌లో శేఖర్ మాస్టర్ మరో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వీరిద్దరిపై ఒక ప్రొమో కూడా చిత్రీకరించడం జరిగింది. అయితే... ఈ షోకు ఇకపై  వీళ్లిద్దరే జడ్జీలుగా కొనసాగుతారా? లేకపోతే... ఎలక్షన్స్ తర్వాత మళ్లీ నాగబాబు, రోజాలే జడ్జీలుగా కొనసాగుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.
 
ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే రోజాకు మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. ముందు ముందు ఈ షోకు ఎవరు జడ్జీలుగా వ్యవహిస్తారో తెలియాలంటే ఆంధ్రలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడేవరకు వేచి చూడాల్సిందేగా మరి.