1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (17:11 IST)

సుమన్ కు కాంతారావు శత జయంతి పురస్కారం, బయో పిక్ కు సన్నాహాలు

P. C. Aditya, Sudhakar, Tamma Reddy, Rellangi Narasimha Rao and Kanta Rao  son Raja
P. C. Aditya, Sudhakar, Tamma Reddy, Rellangi Narasimha Rao and Kanta Rao son Raja
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరో లుగా వెలుగుతున్న సమయంలోనే వారికి ధీటుగా ప్రముఖ హీరోగా కాంతారావు నిలబడ్డారని ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ అన్నారు. శనివారం, జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.
 
ప్రసిద్ధ హీరో సుమన్ ఈ అవార్డు అందుకుంటారనీ, హీరో గా నిలదొక్కు కున్నా తదనంతరం ఆయన సహాయ పాత్రల్లో చేయక తప్పలేదని  తమ్మా రెడ్డి అన్నారు. విశిష్ట  అతిథిగా పాల్గొన్న దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, కాంతా రావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావు లో ఆయనకు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. 
 
మరో దర్శకుడు పి. సి. ఆదిత్య మాట్లాడుతూ, కాంతా రావు బయో పిక్ చేయనున్నట్లు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావులకు ధీటుగా హీరోగానూ, సహాయ పాత్రల్లోనూ మెప్పించిన గొప్ప నటుడు ఆయన అని గుర్తుచేశారు. కాంతా రావు బయో పిక్ కోసమై వారి స్వగ్రామం కోదాడ మండలం గుది బండ వెళ్లి వచ్చినట్టు వివరించారు. త్యరలో సమగ్ర వివరాలు తెలియజేస్తామన్నారు.
 
ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమం లో ఫిక్కీ సి. ఎం. డీ అచ్యుత జగదీష్ చంద్ర, కాంతా రావు కుమారుడు నటుడు రాజా తో పాటు పలువురు విలేకరులు,  మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.