1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (18:40 IST)

నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచిన విశాల్ - పదవులన్నీ నాజర్ జట్టుకే

సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) ఎన్నికల్లో సినీ నటుడు నాజర్ సారథ్యంలోని పాండవర్ జట్టు విజయభేరీ మోగించింది. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీలు గెలుపొందారు. అలాగే, ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన పూచ్చి మురుగను, కరుణాస్‌లు కూడా గెలుపొందారు. 
 
ఈ నడిగర్ సంఘానికి గత 2019లో ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో గత మూడేళ్లుగా ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఇటీవల ఓ ఓట్ లెక్కింపునకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును నటుడు ఏళుమలై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అక్కడ కూడా చుక్కెదురైంది. 
 
దీంతో మద్రాస్ హైకోర్టు ఆదేశం మేరకు ఎన్నికల అధికారి రిటైర్జ్ జడ్డి పద్మనాభన్ సక్షమంలో ఆదివారం చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న గుడ్ షెపర్డ్ కాన్వెంట్ స్కూలులో ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రారంభంకాగా, తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఇందులో నాజర్ సారథ్యంలోని పాండవర్ జట్టు సభ్యులు ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆ తర్వాత పోలైన బ్యాలెట్లను లెక్కించగా, ఇందులోనూ పాండవర్ జట్టు సభ్యులే గెలిచారు. 
 
ఫలితంగా నడిగర్ సంఘం అధ్యక్షుడుగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీలు ఎన్నికయ్యారు. మిగిలిన పోస్టులకు కూడా పాండవర్ జట్టుకు చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో నడిగర్ సంఘం ఎన్నికలపై గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. 
 
పాండవర్ జట్టు ప్రత్యర్థిగా జట్టు స్వామి శంకర్ దాస్ ప్యానెల్ తరపున అధ్యక్ష పదవి కె.భాగ్యరాజ్, ప్రధాన కార్యదర్శి పదవికి ఐసరి గణేష్, కోశాధికారిగా ప్రశాంత్‌లు పోటీ చేశారు.