1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

హీరోయిన్ నయనతారపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

nayanathara
సీనియర్ హీరోయిన్ నయనతారపై ముంబై పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ఓ చిత్రంలో నటించారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల నయనతార నటించిన తాజా చిత్రం "అన్నపూరిణి". ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మించింది. అయితే ఈ సినిమాలో రాముడిని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఫిర్యాదుచేశారు.
 
'అన్నపూరిణి' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ చిత్రం లవ్ జిహాద్‌ను బలపరిచేలా ఉందని రమేశ్ సోలంకి విమర్శించారు. 'అన్నపూరిణి' చిత్ర నిర్మాతలపైనా, ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్‌పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
 
ఈ చిత్రంలో ఓ హిందూ పూజారి కుమార్తె నమాజు చదవడం, బిర్యానీ వండడం చూపించారని రమేశ్ సోలంకి వెల్లడించారు. ఇందులో ఫర్హాన్ (నటుడు) ఓ నటిని మాంసం తినాలని కోరతాడని, శ్రీరాముడు కూడా మాంసాహారేనని ఆమెతో చెబుతాడని వివరించారు. త్వరలో అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరగనుండడంతో జీ స్టూడియోస్, నెట్ ఫ్లిక్స్ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఈ చిత్రాన్ని తీసుకువచ్చాయని రమేశ్ సోలంకి ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో... అన్నపూరిణి దర్శకుడు నీలేశ్ కృష్ణ, హీరో జై, హీరోయిన్ నయనత తార, నాడ్ స్టూడియోస్ అధినేత జతిన్ సేథీ, ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేత ఆర్.రవీంద్రన్, జీ స్టూడియోస్ ప్రతినిధి పునీత్ గోయెంకా, ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులు షరీఖ్ పటేల్, మోనికా షేర్ గిల్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రమేశ్ సోలంకి పోలీసులను కోరారు.