శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (08:21 IST)

నిహారిక పెళ్లి సందడి : పవన్ రాకతో సందడే సందడి...

మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశం ఉదయ్ పూర్‌ కోట (ప్యాలెస్)లో బుధవారం జరుగనుంది. ఈ పెళ్లి వేడుక కోసం ఇటు వధువు, అటు వరుడు కుటుంబాలు రెండూ ఇప్పటికే అక్కడికే చేరుకున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు, ఇతర కుటుంబ సభ్యులంతా అక్కడకు ప్రత్యేక విమానాల్లో ఆదివారమే చేరుకున్నారు. 
 
కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం మంగళవారం సాయంత్రానికి ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఆయన వెంట తన కుమారుడు అకీరా, అద్యలు ఉన్నారు. వీరిద్దరిని తీసుకుని ఆయన ప్రత్యేక జెట్ విమానంలో రాజస్థాన్‌కు చేరుకున్నారు. పెళ్లి జరిగే ప్రాంతానికి పవన్ తన ఇద్దరు పిల్లలతో చేరుకోగానే అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ వేడుకలో సందడే సందడి నెలకొంది. 
 
నిజానికి ఈ పెళ్ళి కోసం మెగా ఫ్యామిలీ అంతా రెండు రోజులు ముందుగానే చేరుకుంది. వారిలో పవన్ కళ్యాణ్ లేరు. దీంతో నిహారిక పెళ్లికి పవన్ వస్తాడా? రాడా? అన్న సందేహం నెలకొంది. అయితే, ఈ సందేహాన్ని పటాపంచలు చేస్తూ పవన్ కల్యాణ్ మంగళవారం ఉదయ్ పూర్‌లో ల్యాండయ్యారు. 
 
ఓ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ రాకతో ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో మరింత ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాగబాబు తన సోదరుడు పవన్‌ను వెంటబెట్టుకుని ప్యాలెస్ పరిసరాలను చూపించారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. 
 
కాగా, నిహారిక పెళ్లి బుధవారం రాత్రి 7.15 గంటలకు జరగనుంది. వరుడు గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు చైతన్య. ఈ పెళ్లికోసం కొన్నిరోజుల ముందే ఉదయ్ పూర్ చేరుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంగీత్, ఇతర కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, అల్లు అరవింద్, ఉపాసన, స్నేహారెడ్డి... ఇలా మెగాఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్‌లోనే ఉంది.