శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:04 IST)

#PawanKalyan : "సైరా" కోసం ముందుకొచ్చిన జనసేనాని

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకోగా, ఇతర కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను కూడా రికార్డింగ్ చేస్తున్నారు. అయితే, ఈ వాయిస్‌ను చిరంజీవి తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చెప్పించారు. అంటే సైరా సినిమానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారన్నమాట. ఈ విషయం లీక్ కావడంతో వైరల్ అయింది. 
 
నిజానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే ఫ్రేములో కనిపిస్తే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. గతంలో శంక‌ర్ దాదా ఎంబీబీఎస్, శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రాల‌లో ప‌వ‌న్ త‌ళుక్కున మెరిసి ప్రేక్ష‌కులని ఉత్తేజ‌ప‌ర‌చాడు. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సుబ్బిరామిరెడ్డి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని, దానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు.
 
ఈ పరిస్థితుల్లో చిరంజీవి నటిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరాలో ప‌వ‌న్ వాయిస్ వినిపించ‌నుంది. ప‌వ‌న్ స్వ‌రం మ‌న‌ల్ని చిత్ర క‌థ‌లోకి న‌డిపిస్తుంద‌ట‌. సైరా టీజ‌ర్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైరా చిత్రానికి వాయిస్ ఓవ‌ర్ అందించారు. త‌మ్ముడు భావోద్వేగ స్వ‌రం వినిపిస్తుంటే అన్న‌య్య ప‌క్క‌నే ఉన్నారు. 
 
బ్రిటీష్ పాల‌కుల‌ని ఎదిరించి పోరాడిన స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ స‌ర‌సింహారెడ్డి జీవితానికి వెండితెర రూపం క‌లిపించి సైరా చిత్రాన్ని తెర‌కెక్కించారు. చారిత్రక వీరుడి ఘ‌న‌త‌ను ప‌రిచ‌యం చేసే వ్యాక్యాలు ప‌వ‌న్ వాయిస్ ద్వారా మ‌నం విన‌నున్నాం. రాంచ‌ర‌ణ్ నిర్మిస్తున్న చిత్రంలో చిరు న‌టించ‌డం, ముఖ్య స‌న్నివేశాల‌కి ప‌వ‌న్ గ‌ళం అందించ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌క‌లోకానికి స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుంద‌ని అంటున్నారు.
 
కాగా, అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం వహించగా, అమితాబ్, జగపతిబాబు, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి వంటి అగ్ర నటీనటులు నటిస్తున్నారు.