బుధవారం, 3 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 డిశెంబరు 2025 (20:18 IST)

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

murder
నేటి సమాజంలో బంధు బంధుత్వాలు, మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ తమ్ముడు బీమా డబ్బుల కోసం ఏకంగా అన్ననే హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నవంబరు 29వ తేదీన రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్‌ (39) టిప్పర్‌ ఢీకొని మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం అందింది. శనివారం రాత్రి మట్టి తరలిస్తున్న టిప్పర్‌ బ్రేక్‌ డౌన్‌ కాగా.. వెంకటేశ్‌ టిప్పర్‌ ముందు భాగంలో మరమ్మతు చేస్తున్నాడు. ఇది గమనించిన మృతుడి తమ్ముడు నరేష్‌.. టిప్పర్‌ స్టార్ట్‌ చేసి ముందుకు నడిపించగా, అది కాస్త వెంకటేశ్‌పై నుంచి దూసుకెళ్లింది. దీంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు అని మృతుడి తండ్రి నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో మరింత లోతుగా విచారణ జరిపారు. వెంకటేశ్‌ హత్యకు కుట్ర ప్రణాళికను నిందితులు ఫోన్‌లో వీడియో తీశారు. ఆ వీడియో దొరకడంతో అసలు విషయం వెలుగు చూసింది. 
 
ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు వెంకటేశ్‌ పేరుతో రెండు నెలల్లోనే 10 కంపెనీలలో రూ.4.14 కోట్ల విలువైన బీమా పాలసీలు నరేశ్‌ తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా సొమ్ము కోసమే ఈ హత్య జరిగినట్టు పోలీసులు తేల్చారు.