బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (14:34 IST)

కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా... ఒకటి ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వమ్మా : రాజమౌళి ట్వీట్

Rajamouli
Rajamouli
అందరు అభిమానులు భావిస్తున్నట్టుగానే ఈ గుర్తింపు మీకు ఎపుడో రావాల్సింది అన్నయ్యా అంటూ ఎస్ఎస్ రాజమౌళి భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, తన అన్నయ్య ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. 
 
"అందరు అభిమానులు భావిస్తున్నట్టుగానే ఈ గుర్తింపు మీకు ఎపుడో రావాల్సి వుందన్నారు. అయితే, మీరు ఎపుడూ చెప్పే విధంగా ఒకరి శర్మ గుర్తింపు ఊహించని విధంగా అందుతుందని అన్నారు. తాను ఒకవేళ ఈ విశ్వంతో మాట్లాడగలిగితే... కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా... ఒకటి ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వమ్మా అని చెబుతాను" అని తెలిపారు. దీంతో కీరవాణితో కలిసి దిగిన ఫోటోను రాజమౌళి షేర్ చేసారు. ఈ ఫోటోలో కీరవాణి కుర్చీలో కాలుపై కాలువేసుకుని కూర్చొని వయోలిన్ వాయిస్తుండగా, రాజమౌళి ఆయన పక్కన కింద కూర్చొనివున్నారు. 
 
భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నా : కీరవాణి 
తనను పద్మశ్రీ పౌర పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణి స్పందించారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. "భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు కవితపు సీతన్నగారి నుంచి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు నా గురువులందరికీ గౌరవ వందనాలు తెలియజేస్తున్నా" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, భారత్ 74వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మ పౌర పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రాత్రి కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పురస్కారాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కీరవాణికి ఈ అవకాశం లభించింది. 
 
కాగా, ఆయన సంగీతం అందించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వరించింది. ఇపుడు ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్‌కు ఈ పాట ఎంపికై, ఆస్కార్ అవార్డుకు మరో అడుగు దూరంలో ఉంది.