జల్లికట్టు నిర్వహణ కుదరదంటే దేశం విడిచి వెళ్లిపోతా!: తమిళ హీరో శింబు
తమిళ సంప్రదాయ గ్రామీణ క్రీడ జల్లికట్టు పోటీల నిర్వహణ కుదరదంటే... తాను ఈ దేశాన్ని విడిచిపోతానంటూ తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి దాపురిం
తమిళ సంప్రదాయ గ్రామీణ క్రీడ జల్లికట్టు పోటీల నిర్వహణ కుదరదంటే... తాను ఈ దేశాన్ని విడిచిపోతానంటూ తమిళ హీరో శింబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయం ఉనికినే కోల్పోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. జల్లికట్టు కోసం విడివిడిగా పోరాటం చేస్తే ఫలితం ఉండదని... అందరం కలసికట్టుగా పని చేయాలని సూచించాడు. తమ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నాడు. జల్లికట్టు కోసం తన ఇంటి ముందు పది నిమిషాలు మౌనం పాటిస్తానని చెప్పాడు.
ఇదే అంశంపై శింబు చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో తమిళ ప్రజలు సతమతమవుతూనే ఉన్నారన్నారు. వీటి పరిష్కారం కోస ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో ఎవరైనా మరణిస్తే భారతీయుడు చనిపోయారంటారు. అదే కన్యాకుమారిలో చనిపోతే తమిళ జాలరి మృతి చెందాడంటారు. ఎందుకింత వివక్ష. తాము కూడా భారతీయులమే కదా అని ప్రశ్నించాడు.
మరోవైపు... జల్లికట్టు పోటీల నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పైగా, జల్లికట్టుపై త్వరగా తీర్పు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు న్యాయవాదులు కోరడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు విషయంలో న్యాయవాదులు ఇలా కోరడం సరికాదని చివాట్లు పెట్టింది. తీర్పు ఎప్పుడివ్వాలో తమకు తెలుసని సుప్రీంకోర్టు పేర్కొంది. తమపై న్యాయవాదులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. జంతుహింస అన్న కారణంగా అభ్యంతరం వ్యక్తం కావడంతో 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే, ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం విన్నతులు చేసుకుంటోంది.