1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (15:06 IST)

విజయశాంతిని అంతలా బతిమలాడటానికి కారణం అదే..?!

భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతున్న మహేష్ బాబు - అనిల్ రావిపూడి సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఈ సినిమాలో విజయశాంతిని తీసుకోవడంపై స్పందించారు.
 
అలనాటి మేటి హీరోయిన్‌లలో ఒకరైన విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి హిట్‌లు సాధించి, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకుంది. రాజకీయాలలో బిజీగా మారిన తర్వాత సినిమాలు చేయడం మానేసిన విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు ముఖానికి రంగేసుకుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తోంది. 
 
అయితే ఈ సినిమా కంటే ముందు 'రాజా ది గ్రేట్‌' సినిమా కోసం విజయశాంతి గారిని కలిశాను. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' లైన్‌ అనుకున్నప్పుడే ఈ పాత్ర కోసం ఆవిడను అనుకుని కలబోతున్నానని మహేష్ బాబుకు చెప్పాను. 'మరో నటి ఎవ్వరు చేసినా కుదరదు.. వేరే వాళ్లు చేస్తే ఆ మ్యాజిక్ రాదు. సో ఆ మ్యాజిక్ మిస్ కాకూడదనే అంతలా బతిమిలాడాను' అని అనిల్ రావిపూడి అన్నాడు.