గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 జులై 2024 (11:12 IST)

బ్యాంక్ క్యాషియర్‌గా లక్కీ భాస్కర్ ఏమిచేసాడు ?

Dulquer Salmaan
Dulquer Salmaan
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ''లక్కీ భాస్కర్'' చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ విడుదలయింది. ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
 
''లక్కీ భాస్కర్'' సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, "శ్రీమతి గారు" గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచాయి.  తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ విడుదలైంది. ఇటీవలే దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా "లక్కీ భాస్కర్" నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ పాట మనల్ని 1980-90ల రోజుల్లోకి తీసుకెళ్తోంది. వాయిద్యాలు వినియోగించిన విధానం, ముఖ్యంగా లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ గాత్రం.. ఈ గీతాన్ని  ఓ కమ్మటి విందు భోజనంలా మలిచాయి.
 
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మరోసారి తన కలం బలం చూపించారు. "శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా" అంటూ తనదైన సాహిత్యంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. కథానాయకుడి పాత్రను ఆవిష్కరించడంతో పాటు, శ్రోతలలో స్ఫూర్తి నింపేలా సాహిత్యాన్ని అందించారు.
 
ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ పాట కోసం 1980ల నాటి ఇండి-రాక్‌ని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా స్వరపరిచారు. ఈ గీతం ప్రస్తుత గీతాలకు భిన్నంగా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. వయసు, భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకునేలా ఉంది. 
 
1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ''లక్కీ భాస్కర్'' చిత్రంలో చూడబోతున్నాం. దుల్కర్ సల్మాన్ సినీ ప్రయాణంలో మరొక చిరస్మరణీయమైన చిత్రంలా నిలిచేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని మలుస్తున్నారు.
 
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
"లక్కీ భాస్కర్" చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ ఈ చిత్రం కోసం 80ల నాటి ముంబైని పునర్నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన అద్భుత పనికి అవార్డులు అందుతాయని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి కెమెరా పనితనం దర్శకుని ఊహకు ప్రాణం పోసింది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
 
భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.