1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: మంగళవారం, 25 మే 2021 (22:05 IST)

ఆనందయ్య మందు: కరోనా రాకుండానే మింగేశారట చాలామంది, ఇక ఇప్పట్లో పంపిణీ లేనట్లేనా?

ఆనందయ్య తయారుచేసిన ఔషధంపై పరిశోధనలు పూర్తయి త్వరగా కరోనా రోగులకు ఇస్తే బతికుతారన్నది చాలామంది నమ్మకం. అయితే ఇప్పటికే ప్రభుత్వం దీనిపై పరిశోధనలు చేయమని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థను కోరడం.. ఆ సంస్థ ద్వారా ఎపిలోని విజయవాడ, తిరుపతికి చెందిన ఆయుర్వేద కళాశాలలలో పరిశోధన ప్రారంభమైన విషయం తెలిసిందే.
 
నిన్న నెల్లూరు జిల్లాకు ఐసిఎంఆర్ బృందం వెళ్ళాల్సి ఉంది. కానీ వెళ్ళకపోవడం.. ఆయుర్వేద సంస్థకు దీన్ని అప్పగించడం జరిగిపోయింది. నిన్నటి నుంచి ఆనందయ్య దగ్గర ట్రీట్మెంట్ పొందిన 500 మంది కరోనా రోగులతో ఫోన్లో మాట్లాడుతున్నారు ఆయుర్వేద కళాశాల సిబ్బంది.
 
అసలు కరోనా రావడంతోనే మీరు మందు వాడారా.. లేకుంటే పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిశామన్న భయంతో పరీక్ష చేయించుకోకుండానే మందు వాడారా.. అస్సలు కరోనా రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందే మందు వాడారా అని అడిగేందుకు ఫోన్లు చేశారు. కానీ ఫోన్లు చేస్తే చివరకు ఆరోగ్య కార్యకర్తలకు వెళుతోంది.
 
చాలామంది కరోనా రోగులు ఆరోగ్య కార్యకర్తల నెంబర్లు ఇవ్వడంతో పాటు పనిచేస్తున్న నెంబర్లలో ఉన్న వ్యక్తులు మాత్రం కరోనా రాకుండానే మందులు వాడేశారట. దీంతో చేతులెత్తేశారు ఆయుర్వేద వైద్య సిబ్బంది. కరోనా సోకి ట్రీట్మెంట్ పొందిన వారి వివరాలు ఇస్తేనే తాము ఒక ప్రాధమిక నిర్ధారణకు రాగలమని తేల్చేశారు ఆయుర్వేద సిబ్బంది. 
 
ఇదే విషయాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీకి తెలియజేశారు. దీంతో ఆనందయ్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు నెల్లూరుజిల్లా పోలీసులు. నాలుగైదు వారాల్లోగానే ఔషధంపై పరిశోధనలు పూర్తిచేస్తామన్న ఆయుర్వేద వైద్య సిబ్బంది చివరకు ప్రాథమిక దశలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ వారే చెప్పేస్తున్నారు.