శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (21:10 IST)

రూపాయి ఖ‌ర్చు లేకుండా అన్న‌వ‌రంలో క‌ల్యాణ‌మండ‌పం

పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ఛార్జీలంటాయి. కానీ ఇపుడు అన్న‌వ‌రం స‌త్య‌దేవుడి స‌న్నిధిలో ఒక్క రూపాయి ఖ‌ర్చులేకుండా అద్భుత‌మైన క‌ల్యాణ మండ‌పాలు భ‌క్తుల‌కు త‌యార‌య్యాయి.

లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ 4 కోట్ల రూపాయ‌ల‌ వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో అధికారులు ఇప్ప‌టికే బుకింగ్‌లు ప్రారంభించారు. ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.
 
పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ కళ్యాణ వేదికను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా, వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు బుకింగ్స్ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకు వస్తే, ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.
 
ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు స్ప‌ష్టం చేశారు.