గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (19:21 IST)

మహిళా రోగి కిడ్నీలు చోరీ చేసిన వైద్యులు.. ఎక్కడ?

Kidney
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ మహిళా రోగి కిడ్నీలను ఇద్దరు వైద్యులు చోరీ చేశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ విషయం బయటపడింది. దీంతో తన కిడ్నీలు చోరీ చేసిన ఇద్దరు వైద్యుల కిడ్నీలు తీసి తనకు అమర్చాలని ఆ మహిళ డిమాండ్ చేస్తుంది. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన 38 యేళ్ళ సునితా దేవి అనే మహిళ గర్భాశయం తొలగింపునకు గత సెప్టెంబరు 3వ తేదీన బరియాపూర్ గ్రామంలోని శుభకాంత్ క్లినిక్‌కు వెళ్లింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చకున్న వైద్యులు.. గర్భాశయానికి బదులుగా రెండు కిడ్నీలను ఆమెకు తెలియకుండా తొలగించారు. 
 
ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముజఫర‌పూర్‌లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి ఆమెను పరిశీలించిన వైద్యులు.. ఆమెకు రెండు కిడ్నీలు లేవని వెల్లడించండంతో సునితా దేవి కుటుంబ సభ్యులు షాకయ్యారు. 
 
పైగా, ఆమెకు ప్రతి రోజూ డయాలసిస్ చేయకపోతే ప్రాణాలతో ఉండలేదని చెప్పారు. అందువల్ల మెరుగైన వైద్యం కోసం పాట్నాలోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రిఫర్ చేశారు. అక్కడ ఆమెకు మెరుగైన చికిత్స అందించి తిరిగి శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
 
ఈ విషయం వెలుగులోకి రాగనే కిడ్నీలు చోరీ చేసిన ఇద్దరు వైద్యులు కనిపించకుండా పోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ఇద్దరు వైద్యుల కిడ్నీలు తీసి తనకు అమర్చాలని ఆమె డిమాండ్ చేస్తుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.