1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (14:36 IST)

Noorjahan మామిడి.. ఒక్క పండు ధర రూ.1000.. ఒక్కో పండు బరువు 2.5 కిలోలు

Mango
వేసవి కాలంలో మామిడి పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. బంగినపల్లి మామిడి పండ్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. తాజాగా ఈ సీజన్‌లో నూర్జహాన్ మామిడి పండ్లకు మంచి క్రేజ్ దక్కింది. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండించే ఈ రకం మామిడి పండ్లకు ఒక్కొక్కటి రూ.500 నుంచి రూ.1,000 పలుకుతుండటం విశేషం. జనవరి, ఫిబ్రవరిలో ఈ చెట్లు పూతకు పూస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయి. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగు మేర పొడువు ఉంటాయి.
 
ఈ సీజన్‌లో వాతావరణపరంగా అనుకూల పరిస్థితులు ఉండటంతో పలు వైవిధ్యమైన రుచులతో కూడిన మామిడి పండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిలో నూర్జహాన్ రకం మామిడికి చాలా మంది ఫిదా అవుతున్నారు. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఈ రకం మామిడిని అలీరాజ్‌పూర్‌ జిల్లాలోని కత్తివాడలోనే పండిస్తున్నారు. ఈ ప్రాంతం గుజరాత్ బార్డర్‌కు సమీపంలో ఉంది. 
 
రెండు నుంచి మూడున్నర కిలోల బరువుండే నూర్జహాన్ మామిడి రుచి అదరహో అని ఫ్రూట్‌లవర్స్ అంటుండగా.. వీటిని పండించడం ద్వారా మంచి లాభాలు గడిస్తున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఒక్కో కాయ మూడు కిలోల వరకు తూగుతున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల ఒక్కో పండు బరువు 2.5 కిలోల వరకే పరిమితమైనట్లు రైతులు తెలిపారు. పైగా కరోనా ప్రభావంతో 2020 వేసవిలో పెద్దగా డబ్బులేమీ రాలేదని వాపోయారు. 
 
కానీ, ఈసారి మాత్రం మార్కెట్‌లో నూర్జహాన్‌ పండుకు మంచి డిమాండ్‌ ఉన్నట్లు రైతులు తెలిపారు. ఒక్కో పండును రూ.1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో దీని ధర రూ.1,200 వరకు పలకడం గమనార్హం.