శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2019 (17:19 IST)

సమాధులకు పోలీసు భద్రతా..? చంద్రబాబు ఇలా చేశారా? పీకేసిన సీఎం జగన్...

అధికారమైనా, ప్రతిపక్షమైనా చంద్రబాబునాయుడుకు మాత్రం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో తన కుమారుడు నారా లోకేష్‌‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. అంతేకాదు మనవడు దేవాన్ష్‌కు భద్రతను నియమించారన్నది వాదన. ఇద్దరు పోలీసులు దేవాన్ష్‌కి సెక్యూరిటీగా ఉండేవారని సమాచారం.
 
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు తన స్వగ్రామం నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గట్టి సెక్యూరిటీని ఉంచారు. తల్లిదండ్రులు ఖర్జూరానాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద 11 మంది పోలీసులు విధులు నిర్వర్తించేవారన్న ఓ వార్త ఇప్పుడు నెట్లో చెక్కర్లు కొడుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి వుంది.
 
ఇక ఇంటి వద్ద అయితే 17 మంది పోలీసుల భద్రత. ఇలా మొత్తం 28 మంది పోలీసులు ఇంటి వద్ద, సమాధుల వద్ద విధులను నిర్వర్తించేవారు. స్థానిక పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్, ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది విధుల్లో ఉండేవారు. అయితే విషయం తెలుసుకున్న ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం భద్రతను తగ్గించేశారు. నారావారిపల్లిలో స్థానికంగా ఉన్న పోలీసులను కూడా పర్యవేక్షించే విధంగా ఆదేశాలిచ్చారు. దీంతో 28 మంది పోలీసులు చంద్రబాబునాయుడు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. 
 
కేవలం ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానిక పోలీసులు మాత్రం సాయంత్రం వేళల్లో చుట్టపుచూపుగా వచ్చి ఇంటిని చూసి వెళ్ళిపోతున్నారు. సిఎం నిర్ణయంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.