1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (11:42 IST)

ఉక్రెయిన్ పైన హింసను వెంటనే ఆపేయండి: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోదీ విజ్ఞప్తి

ఉక్రెయిన్‌ పైన రష్యా దాడితో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ దేశస్థులు కుమిలిపోతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ పైన రష్యా దాడిని అమెరికా, యూరోపియన్ నాయకులు ఖండించారు. కానీ అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.

 
ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ఫోన్ చేసారు. ఉక్రెయిన్ పైన దాడిని తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా చర్యను ఖండించాలని భారత్‌పై ఒత్తిడి చేస్తున్న పాశ్చాత్య కూటమికి ప్రధాని రష్యా అధ్యక్షుడితో మాట్లాడటంతో అంతా ఇటువైపే చూస్తున్నారు. ఉక్రెయిన్ సైతం ప్రధాని మోదీ వైపు ఆశగా చూస్తోంది.

 
ఇంకోవైపు రష్యన్ సైనిక బలగాలు ప్రేరేపించని, అన్యాయమైన దాడిని ఉక్రెయిన్ దేశం పైన దిగాయని అమెరికా అధ్యక్షుడు అన్నారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ... పుతిన్ చేతులు ఉక్రెయిన్ రక్తంతో తడిసిపోయాయని అన్నారు.

 
రష్యా, నాటో దేశాల మధ్య తలెత్తిన విభేదాలు చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని ప్రధానమంత్రి మోదీ విశ్వాసం వ్యక్తం చేసారు. ఉక్రెయిన్ పైన హింసను తక్షణమే నిలిపివేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన చర్చలు, సంభాషణలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దేశాలన్నీ సంఘటితంగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.