1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: మంగళవారం, 23 మార్చి 2021 (17:10 IST)

ఏడుగురు మంత్రులు, 700 కోట్లు డబ్బు సంచులు, తిరుపతిలో 4 లక్షల మెజారిటీ, ఎవరు?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ చింతామోహన్ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయన మాటల్లోనే... ''తిరుపతిని మరో పులివెందులుగా మార్చాలని జగన్  అనుకుంటున్నాడు. సేవ్ తిరుపతి, తిరుపతి నగరం పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
 
ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు కలసికట్టుగా ముందుకు రావాలి. రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యబద్దంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగాలి. చిన్న పొరపాటు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ సహించదు. అధికారులు, పోలీసు యంత్రాంగం తమ పరిధి దాటి, అధికార పార్టీ మెప్పు కోసం పని చేస్తే చూస్తూ ఊరుకోం.  తప్పులు చేసే అధికారులను గుర్తు పెట్టుకుని, జైలుకు పంపుతాము.
 
ఏడుగురు మంత్రులు, 700 కోట్లు డబ్బు సంచులు, సారా తెచ్చి, ఓట్లు కొనుగోలు చేసి, తిరుపతిలో 4 లక్షల మెజారిటీతో గెలవాలని వైకాపా అనుకుంటోంది. ఒక్క రూపాయి డబ్బు పంచినా, సారాతో ఓటర్లను ప్రభావితం చెయ్యలనుకుంటే, సహించబోం. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందులలో 2500 ఓట్లు మెజారిటీతో గెలిచాడు. నేడు పులివెందులలో లక్షల మెజారిటీ ఎలా సాధ్యం??
 
లైట్లు ఆర్పి, చీకట్లో దొంగ ఓట్లు వేసుకునేందుకే రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సమయం పెంచుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి. రైల్వే శాఖలలో 3 లక్షల మంది ఉద్యోగులలను ఇంటికి పంపేందుకు బిజెపి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. 58 సంవత్సరాలు దాటిన, 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న రైల్వే ఉద్యోగస్తులను ఉద్వాసన పలికేందుకు బిజెపి ప్రభుత్వం రెడీగా ఉంది.
 
ఎన్నికల అనంతరం, అతి త్వరలో ప్రైవేటీకరణ చర్చలలో భాగంగా దేశంలోని రైళ్లను అమ్మేస్తారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అవినీతిపరులు, నిజాయితీకి మధ్య జరుగుతున్న యుధ్ధం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక. నిరుపేదలు, కోటీశ్వరులకు మధ్య జరుగుతున్న యుధ్ధం ఈ ఎన్నిక.
 
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీకే సాధ్యం'' అన్నారు. రేణిగుంట బజారు వీధి, జ్యోతినగర్, అన్నానగర్, పోస్టాఫీసు వీధి, బస్టాండ్, రైల్వే స్టేషన్, బుగ్గ వీధిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసంకేంద్ర మాజీ మంత్రి చింతామోహన్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.