శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (07:14 IST)

ప్రజలకు మాస్కులు స్వయంగా తొడిగిన ముఖ్యమంత్రి!

దేశంలో కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. ముఖ్యంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించించనుందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని, చేతులకు శానిటైజేషన్ చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ ముందుకు సాగాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ, ప్రజలు మాత్రం ఏమాత్రం లెక్క చేయడం లేదు. 
 
ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతూ ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకులుగా మారారు. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోమారు తన ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన రోడ్లపై మాస్కులు లేకుండా తిరుగుతున్న జనాన్ని చూసి తన కాన్వాయ్‌ ఆపి మాస్కులు పంచిపెట్టారు. కొందరికి ఆయనే స్వయంగా మాస్కులు తొడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
సచివాలయం నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలాగే, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా టీకాలు వేయించుకోవాలని, చేతులకు అపుడపుడూ శానిటైజ్ చేసుకుంటూ, భౌతికదూరం పాటించాలని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.