యేడాదిలో 12 సిలిండర్లు ఎపుడైనా కొనుగోలు చేసుకోవచ్చు : కేంద్రం
ప్రభుత్వం సబ్సీడీ రూపంలో ఇచ్చే 12 వంట గ్యాస్ సిలిండర్లను ఎపుడైనా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా నెలకొక్క సబ్సీడీ సిలిండర్ మాత్రమే కొనుగోలు చేసుకోవాలన్న ఇబ్బంది నుంచి వినియోగదారులకు కేంద్రం విముక్తి కల్పించింది. అదేసమయంలో యేడాదిలో 12 సిలిండర్ల పరిమితి దాటిన వారు అదనపు సిలిండర్ కోసం మార్కెట్ రేటు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
యూపీఏ హయాంలో సబ్సీడీ గ్యాస్ సిలిండర్ల పంపిణీపై అయోమయం నెలకొంది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 12 దాకా ఇవ్వనున్నట్లు ఎన్నికలకు ముందు యూపీఏ ప్రకటించింది. అందుకనుగుణంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే 12 సిలిండర్లను నెలకొకటి చొప్పున మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టింది. కానీ పండగల సమయంలో ఓ కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ సిలిండర్ల అవసరమవుతాయి.
అదే సమయంలో సాధారణ సమయాల్లో ఒక సిలిండర్ నెలకుపైగా సరిపోయే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో నెలకు ఒక సిలిండర్ మాత్రమే సబ్సీడీ రేటు కింద ఇస్తామంటే, మెజార్టీ కుటుంబాలు దీనిని సద్వినియోగం చేసుకోలేవు. ఈ పరిస్థితిని కూలంకషంగా పరిశీలించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నెలకో సబ్సీడీ సిలిండర్ నిబంధనను తొలగిస్తూ బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో ఒక కుటుంబం ఏడాదిలో ఎప్పుడైనా 12 సిలిండర్లను సబ్సీడీ రేటు కింద పొందే వెసులుబాటు లభించనుందని కేంద్ర టెలికాం, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.