దేశ వ్యాప్తంగా స్తంభించిన రిలయన్స్ జియో సేవలు
దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొబైల్ ఇంటర్నెట్, కాల్ డ్రాప్ వంటి సమస్యలతో పాటు మొబైల్ రీచార్జ్ చేసేందుకు కూడా వీలుపడలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. కేరళ రాష్ట్రంలో అయితే, ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిలయన్స్ జియో సేవలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, ఈ అంతరాయానికి గల కారణాలు తెలియాల్సివుంది.
ఆన్లైన్ సేవల అంతరాయాన్ని పర్యవేక్షించే డౌన్ డెటెక్టర్ వెల్లడించిన వివరాల మేరకు.. 57 శాతం మంచి వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్తో సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఫిర్యాదులు చేశారు. మరో 32 శాతం మంది తమ మొబైల్ కనెక్టివిటీ ప్రభావితమైనందని పేర్కొన్నారు. అలాగే, 11 శాతం మంది యూజర్లు జియో ఫైబర్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. అయితే, ఈ సమస్య కేరళ రాష్ట్రంలో అధికంగా ఉంది. పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా జియో సేవల అంతరాయంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.