రాత్రికి రూ. 10 వేలు అంటే వెళ్లింది, తెల్లారాక డబ్బు ఇమ్మంటే గొంతు కోసాడు
తన కోర్కె తీర్చితే ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తానని 22 ఏళ్ల యువతిని నమ్మించి హోటల్ గదికి తీసుకుని వెళ్లాడు. ముందుగానే డబ్బు ఇవ్వాలని ఆ యువతి పట్టుబట్టగా తెల్లారగానే ఇస్తానన్నాడు. రాత్రంతా కోర్కె తీర్చుకుని తెల్లారగానే ఆమె అడిగిన డబ్బు ఇవ్వకుండా గొంతు కోసి హత్య చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. శనివారం నాడు ఓ పబ్లిక్ టాయిలెట్లో 22 ఏళ్ల యువతి మృత దేహాన్ని స్థానికులు కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
మృతి చెందిన యువతి మోడల్ టౌన్ లో గుడ్మండి ప్రాంతవాసి అనీ, ఆమె పేరు నందిని అని చెప్పారు. కాగా ఆమె శరీరంలో ఆరు టాటూ గుర్తులు కూడా వున్నాయి. మృతదేహం గోనె సంచీలో వుండటంతో వెలికి తీసి పరిశీలించారు. అనంతరం నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు కేశవ్. వయసు 50 ఏళ్లు. ఆ రాత్రి ఏం జరిగిందన్న విషయాన్ని పోలీసులు తమదైన శైలిలో నిందితుడి వద్ద విచారణ చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నందినిని తన కోర్కె తీర్చితే రూ. 10 వేలు ఇస్తానని నమ్మించినట్లు చెప్పాడు. దాంతో ఆమె అతడి మాటలు నమ్మి హోటల్ గదికి వెళ్లింది. అక్కడ రాత్రంతా ఆమెతో గడిపిన అనంతరం కేశవ్ మెల్లగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసాడు. అతడి వాలకం కనిపెట్టిన నందిని తనకు డబ్బు ఇచ్చి కదలాలంటూ పట్టుబట్టింది. ప్రస్తుతానికి తనవద్ద లేవనీ, రాగానే ఇస్తానంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.
అందుకు ఆ యువతి ఆగ్రహంతో డబ్బు ఇవ్వకుండా కోర్కె ఎలా తీర్చుకున్నావంటూ అతడిపై మండిపడింది. అంతేకాకుండా తనపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరించింది. దీనితో భయపడిపోయిన కేశవ్.... కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేసాడు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని గోనె సంచిలో కట్టి తీసుకుని వెళ్లి పబ్లిక్ టాయిలెట్లో పడేసి వెళ్లిపోయాడు.