పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్ నారంగ్ ఛాంబర్ పదవికి ఎసరు !
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. రెండు రోజులనాడు హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్స్గా రవీంద్ర గోపాల, ఉదయ్ కుమార్ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్ వి ఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్ర శేఖర్ రావు జే, ట్రెజరర్ గా సత్యన్నారాయణ గౌడ్.బి ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ని ప్రకటించారు.
అయితే ఎన్నికైన 24 గంటలలోపు అధ్యక్షునిగా సునీల్ నారంగ్ పదవీ విరమణ చేశారు. ఇందుకు తన సన్నిహితులు చేసిన అత్యుత్సాహం తనపై నిందమోపిందని అందుకే కలత చెందిన విరమించుకున్నట్లు ప్రకటించారు. మూడేళ్ళుగా సాఫీగా ఛాంబర్ ఎన్నిక, కమిటీ ఎంపిక అనేది సెలైంట్ గా జరిగింది. కానీ ఈసారి మాత్రం మీడియా ముందుకు రావడమే తప్పిదంగా ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇప్పటికే చలనచిత్రపరిశ్రమలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, థియేటర్ల బంద్ విషయం, పవన్ కళ్యాణ్ సినిమాకు బంద్ ఎపెక్ట్ తోపాటు హీరోలు సినిమాలు ఏడాదికి మూడేళ్ళకు చేయడం వల్ల థియేటర్ల ఫీడ్ బ్యాక్ సమస్య తలెత్తింది. దాన్ని సానుకూలంగా చేయడానికి మీడియా అడిగిన ప్రశ్నలకు నారంగ్ సానుకూలంగా సమాధానం చెప్పినా, కార్యదర్శిగా వున్న శ్రీధర్ మాత్రం హీరోలను ఏకవచనంతో సంబోధిస్తూ ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు. దీనిపై సినీ పెద్దలు అందరూ ఏకదాటిగా రావడం విశేషం. దానికి కారణం అగ్రహీరోలైన నలుగురుకి శ్రీధర్ మాటలు ఇబ్బంది కలిగించాయి. పైగా అక్కడ వున్న అధ్యక్షుడు కూడా శ్రీధర్ అనే వ్యక్తి మాటలు ఖండించకుండా వుండడంతో అతనే ఇలా మాట్లాడించాడని ఫీడ్ బ్యాక్ ఆ హీరోలుకు వెళ్ళింది. దాంతో వారంతా ఫోన్లలో తలంటు పోశారని అందుకే తట్టుకోలేక పదవిని తప్పుకున్నాడని ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి.
సో.. ఏది ఏమైనా మైక్ వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆతర్వాత సారీ అని చెప్పడం అనేది ఇతర రంగాల్లో చెల్లుబాటు అవుతుందేమోకానీ సినిమా రంగంలో అలా కాదని ఓ ప్రముఖ నిర్మాత విశ్లేషించడం విశేషం.