మంగళవారం, 24 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 23 జూన్ 2025 (14:20 IST)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Father kills daughter over low marks in NEET practice test
NEET. ఈ పరీక్షలో అర్హత పొందితే డాక్టర్ కావచ్చు. ఒకవేళ అర్హత సాధించకపోతే ఏమవుతుంది. తల్లిదండ్రుల చేతుల్లో విద్యార్థినీవిద్యార్థులకు నరకయాతన లభిస్తోంది. పలుచోట్ల ప్రైవేటు స్కూలు యాజమాన్యం నీట్ పేరుతో విద్యార్థులపై మానసిక దాడి చేస్తున్నాయి. ఇంకొన్నిచోట్ల తమ పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతారో అని తల్లిదండ్రులు లేనిపోని మానసిక ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. NEET ప్రాక్టీసు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కన్నకూతురుని రోకటి బండతో గొడ్డును బాదినట్లు బాది చంపేసాడు ఓ కర్కశ తండ్రి. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్ర లోని అట్పాడి తాలూకా నేలకరంజి గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని సాధన NEET పరీక్షల్లో అర్హత సాధించేందుకు ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటరుకు వెళుతోంది. ఇటీవల ఆ సెంటర్లో ప్రాక్టీస్ టెస్ట్ నిర్వహించారు. అందులో ఆమెకి అనుకున్నంతగా మార్కులు రాలేదు. దాంతో ఆమె తండ్రి ధొండిరాం భోస్తే తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. కుమార్తెను నోటికొచ్చిన తిట్లు తిడుతూ ఇంట్లో వున్న రోకటి బండను తీసుకుని ఆమెపై దాడి చేసాడు.
 
తదుపరి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తాను నాన్నా అని ఆ విద్యార్థిని వేడుకున్నా కూడా కర్కశ తండ్రి హృదయం కరగలేదు. కుమార్తెను గొడ్డును బాదినట్లు బాదాడు. దాంతో ఆమె ఆ దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయింది. ఆమె తల్లి వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని ధృవీకరించారు. తొలుత తమ కుమార్తె ప్రమాదవశాత్తూ కిందపడిపోయిందని అబద్ధం చెప్పాడు ఆ తండ్రి. ఐతే పోస్టుమార్టం రిపోర్టులో విద్యార్థిని శరీరం లోపల అంతా కనబడని గాయాలున్నట్లు తేలింది. తండ్రి వద్ద గట్టిగా ప్రశ్నించడంతో వాస్తవం బైటకు వచ్చింది.
 
మృతురాలు సాధన అత్యంత ప్రతిభగల విద్యార్థిని. ఆమె 10వ తరగతి పరీక్షల్లో 92.60% మార్కులతో స్కూల్ ఫస్ట్ గా నిలిచింది. ఆమె స్కూల్ ఫస్ట్ రావడంతో సాధనను వైద్యురాలిని చేయాలని ఆమె తండ్రి కలలుగన్నాడు. ఇందులో భాగంగా ఆమెను ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో నీట్ ప్రిపరేషన్ కోసం చేర్పించాడు. నీట్ ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులు రావడంతో ఆమెను చంపేసాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే.... మృతురాలు సాధన తండ్రి ఓ ప్రైవేట్ పాఠశాలకు హెడ్ మాస్టారుగా విధులు నిర్వహిస్తుండటం. కుమార్తె మరణానికి కారణమైన ఈ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసారు.
 
మరోవైపు నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఏ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారో ఈ ఘటనతో రుజువవుతోందనీ, పిల్లలు మైండ్ మెషీన్లు కాదనీ, వారు ఏ విభాగంలో రాణిస్తే ఆ బాటలోనే వారికి తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేగానీ... పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని పిల్లల్ని ఇలా హింసించి చంపేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.