శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (16:38 IST)

శ్రమ దోపిడీ కేసులో హిందుజా కుటుంబ సభ్యులకు జైలుశిక్ష!!

jail
శ్రమదోపిడీ కేసులో భారత సంతతికి చెందిన బ్రిటన్ సంపన్న హిందుజా కుటుంబంలోని నలుగురికి జైలు శిక్ష పడింది. స్విట్జర్లాండ‌లోని విల్లాలో పనిచేసే సిబ్బందిపై శ్రమ దోపిడీకి పాల్పడ్డారనే కేసులో ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్క నాలుగున్నరేళ్లు, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు నాలుగేళ్ల చొప్పున స్విస్ న్యాయస్థానం జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే, కోర్టు తీర్పుపై నలుగురు నిందితులు పైకోర్టులో అప్పీలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. 
 
ఇక హిందుజా కుటుంబ సభ్యులు కార్మికుల శ్రమదోపిడీతో పాటు వారికి స్వల్ప ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో కూడా విఫలమయ్యారని స్విస్ కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బందికి చెల్లించే వేతనాలు స్విట్జర్లాండ్‌లో అటువంటి ఉద్యోగాలకు చెల్లించే వేతనంలో పదో వంతు కంటే తక్కువగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. మరోవైపు, హిందుజా ఫ్యామిలీపై ఉన్న మానవ అక్రమ రవాణా ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.
 
బ్రిటన్‌లోని అత్యంత సంపన్నులైన హిందుజా కుటుంబం కార్మికుల పాస్ పోర్టులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులైన భారతీయులు ఉన్నట్లు తెలిపింది. ఒక ఉద్యోగి జీతం కంటే తమ కుక్క కోసం ఎక్కువ ఖర్చు చేశారని కూడా ఆరోపించారు. పైగా ఉద్యోగులకు స్విస్ ఫ్రాంక్‌లలో కూడా కాకుండా రూపాయల్లోనే జీతాలు ఇచ్చేవారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
 
నలుగురు కుటుంబ సభ్యులు కార్మికులను విల్లా నుండి బయటకు రాకుండా నిర్బంధించినట్లు తెలిపింది. వారితో ఎక్కువ గంటలు పని చేయమని బలవంతం చేశారని ఆరోపించింది. పలు సందర్భాల్లో సిబ్బంది విరామం లేకుండా రోజుకు 18 గంటల వరకు పని చేయవలసి వచ్చిందని ప్రాసిక్యూషన్ చెప్పుకొచ్చింది.