అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!
ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో అగ్రరాజ్యాన్ని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు ఈ దాడుల ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి..అమెరికా అతి పెద్ద నేరం చేసిందని..ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది.
పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన రెండు రోజుల్లోనే ట్రంప్ ఇరాన్పై దాడులు చేశారు.
అనంతరం అమెరికా భారీ బాంబులు ఫోర్డోపై వేసిందని.. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్, అమెరికా చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన పరిణామమని తెలిపారు. తమ దాడులతో ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
మరోవైపు ఇరాన్పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హూతీలు ట్రంప్ను హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.