శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 జులై 2025 (10:46 IST)

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

amarnath yaatra
అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి బయలుదేరే అమర్నాథ్ యాత్రలను నిలిపివేసినట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది. కుండపోత వర్షం కారణంగా ప్రభావితమైన యాత్రా స్థలాలలో అధికారులు అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో యాత్రను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
 
'గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు మార్గాల్లోని ట్రాక్‌పై పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం రెండు బేస్ క్యాంపుల నుంచి యాత్రను నిలిపివేయడం జరిగింది' అని జమ్మూ కాశ్మీర్ ప్రజా సంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.
 
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా, ట్రాక్‌పై అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. అందువల్ల, ఈ రోజు రెండు బేస్ క్యాంపుల నుంచి యాత్రకు అనుమతించకూడదని నిర్ణయించారు అని ఆయన అన్నారు.
 
ఇక, ఈ నెల 3న తీర్థయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి 2.35 లక్షలకు పైగా యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అలాగే ఇప్పటివరకు 4 లక్షలకు పైగా భక్తులు తీర్థయాత్ర కోసం ఆన్‌లైనులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది.