శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:03 IST)

బిస్కెట్ తీసుకుందామని యంత్రంలో చేయిపెట్టిన చిన్నారి.. తర్వాత?

Cream biscuits
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ చిన్నారి తల్లి కళ్ల ముందే యంత్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... థానే జిల్లాలోని ఆనంద్‌ నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న పూజా కుమారి.. అంబరనాథ్‌ ప్రాంతంలో ఉన్న ఓ బిస్కెట్‌ కంపెనీలో కార్మికులకు లంచ్‌ బాక్సులు సరఫరా చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె లంచ్‌ బాక్సులు ఇవ్వడానికి తన మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ను వెంటబెట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్లింది. ఆమె కార్మికులకు లంచ్‌ బాక్సులు ఇస్తున్న సమయంలో చిన్నారికి యంత్రంలోని పడిపోయిన బిస్కెట్‌ ముక్కలు కనిపించాయి. వెంటనే ఆ మెషీన్ లోని బిస్కెట్లు తీసుకునేందుకు ఆ చిన్నారి చేయి చాచింది. అంతే మెషిన్ లో ఉన్న బ్లేడ్‌కు మెడ చిక్కుకోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 
 
కార్మికులు వెంటనే యంత్రాన్ని ఆఫ్‌ చేసి, ఆయుష్‌ను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అప్పటి వరకు అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.