శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల విజేతల్లో 96 శాతం కోటీశ్వరులే...

haryana state
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 96 మంది కోటీశ్వరులేనని తేలింది. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను దక్కించుకుని మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 37 సీట్లను కైవసం చేసుకుంది. ఇతర సీట్లను స్వతంత్రులు, ఐఎన్‌ఎన్డీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 96 శాతం మంది కోటీశ్వరులేనని తేలింది. 
 
ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించగా ఈ విషయం తెలిసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య మూడు శాతం పెరిగినట్లు తేలింది. 13 శాతం మంది విజేతలపై వివిధ రకాలైన నేర కేసులు ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 
 
ఇక 90 మందిలో 44 శాతం మందికి రూ.10 కోట్ల కంటే ఎక్కువగా ఆస్తులున్నాయట. కేవలం 2.2 శాతం మందికి మాత్రమే రూ.20 లక్షల లోపు ఆస్తులున్నాయని తెలిసింది. అలాగే 13 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 95 శాతం కాంగ్రెస్, 96 శాతం బీజేపీ, ఐఎన్ఎల్డీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వందశాతం తమకు రూ.కోటి కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
 
హిసార్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్ రూ.270 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉంటే... రూ.145 కోట్లతో శక్తి రాణిశర్మ (బీజేపీ), రూ.134 కోట్ల ఆస్తులతో శృతి చౌదరి వరుగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అలాగే తిరిగి ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తులు 59 శాతం పెరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. గతంలో వారి ఆస్తులు రూ.9.08 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.14.46 కోట్లకు పెరిగాయని తెలిపింది.