బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని ఒక పెట్రోల్ బంకులో సాగుతున్న ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెయంలోని ఓ పెట్రోల్ బంకులో వాహనదారుడు తన బైకుకు రూ.400కు పెట్రోల్ పోయించగా, కేవలం అర లీటరు మాత్రమే వచ్చింది. దీంతో వాహనదారుడు అవాక్కయ్యాడు.
ఓ వ్యక్తి తన బైకులో పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇంజిన్లో తేడా రావడంతో అనుమానం వచ్చింది. పెట్రోల్ తక్కువగా వచ్చిందేమోనని భావించి, ట్యాంకులోని ఇంధనాన్ని ఓ బకెట్లోకి తీసి చూడటంతో అసలు మోసం బయటపడింది. రూ.400 చెల్లిస్తే కనీసం అర లీటరు పెట్రోల్ కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతూ పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీయగా, వారు సరైన సమాధానం ఇవ్వలేదు. కల్లిబొల్లి మాటలతో సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బందికి, వాహనదారుడుకి వాగ్వాదం జరిగింది.
జిల్లాలలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే బంకుల నిర్వాహకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని స్థానిక వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.