గురువారం, 19 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (13:38 IST)

డీఎంకే ట్రాప్‌లో పన్నీర్ సెల్వం పడిపోయారు.. మీరే నన్ను రక్షించాలి : ఎమ్మెల్యేల భేటీలో శశికళ

డీఎంకే, బీజేపీ నేతల ట్రాప్‌లో ఓ.పన్నీర్ సెల్వం పడిపోయారనీ, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీతో పాటు తనను మీరే రక్షించాలంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. మంగళవారం రాత్రి తమిళనాడు

డీఎంకే, బీజేపీ నేతల ట్రాప్‌లో ఓ.పన్నీర్ సెల్వం పడిపోయారనీ, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీతో పాటు తనను మీరే రక్షించాలంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. మంగళవారం రాత్రి తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం మెరీనా తీరంలోని జయలలిత సమాధి సాక్షిగా తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఆమె బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, 'నా వెనుక మీరంతా (ఎమ్మెల్యేలు) ఉన్నారు... పన్నీర్ సెల్వం వెనుక ప్రతిపక్ష నేత స్టాలిన్ ఉన్నాడు... పార్టీని రక్షించుకోవాలంటే నాకు మద్దతునివ్వాలి' అని కోరారు. పార్టీని కాపాడుకుంటూ, తన స్నేహితురాలి ఆకాంక్షల సాధనకు అండగా నిలవాల్సిన తరుణం ఇదేనని ఆమె తెలిపారు. 
 
పార్టీ శాసనసభాపక్ష నేతగా తన పేరును ప్రకటించి 24 గంటలు తిరగకముందే పన్నీర్ సెల్వం మాటమార్చారని ఆరోపించారు. అమ్మ జ‌య‌ల‌లిత బాట‌లోనే ప‌య‌నిద్దామ‌ని అన్నారు. ప‌న్నీరు సెల్వం వెనుక ఎవ‌రు ఉండి న‌డిపిస్తున్నారో ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని ఆమె పేర్కొన్నారు. త‌న‌ను శాస‌న స‌భ ప‌క్ష‌నేత‌గా గుర్తించిన ప‌న్నీర్ సెల్వం రెండు రోజుల‌కే మాట మార్చార‌ని ఆమె అన్నారు. 
 
అన్నాడీఎంకేను ఏ శక్తీ విభజించలేదనీ, అన్నాడీఎంకే పునాదులను ఎవరూ కదిలించలేరన్నారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత వెంట 33 యేళ్ల పాటు ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాను. ఇపుడు ఆమె కలలు, లక్ష్య సాధనం కోసం పాటుపడుతానని చెప్పారు. దుష్ట శక్తుల పన్నాగాన్ని చిత్తు చేస్తామని శశికళ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు.