భార్యభర్తల మధ్య అన్యోన్యత కొరవడిందా... దాంపత్యంతో చెక్...
నేటి సమాజంలో వివాహ సంబంధాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. రోజు రోజుకూ విడాకులు పొందే దంపతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అందుకు ముఖ్య కారణం దంపతుల మధ్య అన్యోన్యత కొరవడడమే అంటున్నారు మానశిక నిపుణులు. భార్య భర్తల మధ్య నువ్వా, నేనా అనే పోటీ ఏర్పడితే, అది మనస్పర్ధలకు దారితీసి, చివరకు కాపురాన్నే కూల్చేస్తుంది. అందుకే దంపతుల మధ్య అహం పనికిరాదు. ఇద్దరూ తమకు సంబంధించిన విషయాలని అందరి ముందు కాకుండా వ్యక్తిగతంగానే చర్చించుకోవాలి.
కొందరు తన భాగస్వామి మనోభావాలు పట్టించుకోరు. తన అభిప్రాయాలకే ఇంట్లో విలువివ్వాలి అనే ధోరణిలో వ్యవహరిస్తుంటారు. దీనివల్ల మనస్పర్థలు పెరుగుతాయి. స్వార్థం ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ భార్యభర్తల మధ్య కాదు. ఈ ధోరణి వల్ల అన్యోన్యత తగ్గుతుంది. ఇద్దరి మనసుల్లో అగాధాలు పెరిగిపోతాయి. అలాంటి వాటికి తావులేకుండా చూసుకోవాలి. దంపతుల మధ్య ఒకరి కోసం ఒకరు చేసుకునే త్యాగాలే వారి మధ్య ప్రేమానురాగాలను పటిష్ఠం చేస్తాయి.
ప్రస్తుత సమాజంలో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళుతున్నారు. అటువంటి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు వారి వారి ఆఫీసు పనిని వారు గుమ్మం అవతలే వదిలేసి రావాలి. ముఖ్యంగా ఆఫీసు ఒత్తిళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు చూపుకోవడం నిందించుకోవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే భార్యభర్తల బంధం బీటలు వారడానికి కారణమవుతాయి. ఇంట్లో కుటుంబానికి సంబంధించిన విషయాలు తప్ప మిగతా వాటి ప్రాధాన్యం పరిమితం చేయడం మంచిది.
ఆలూమగలు పారదర్శకంగా ఉండటం అవసరం ప్రతి విషయాన్నీ ఒకరికొకరు పంచుకోవాలి. దాపరికం లేకుండా చూసుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఒక్క అబద్ధం చాలు.. కాపురాన్ని కూల్చడానికి. కాబట్టి భార్యభర్తల మధ్య అబద్దాలు అనవసరం. నిజాయతీగానే వ్యవహరించడమే మేలు. అదేవిధంగా భాగస్వామి దగ్గర ఏం దాపరికాలు ఉన్నాయో అని అనుమానించడం కూడా సబబు కాదు.
ఆలుమగలు మధ్య అన్నిటికంటే ముఖ్యమైనది దాంపత్యం. ఇక ఇద్దరి మధ్యా బయట ఎన్ని ఊపిరిసలపని పనులున్నా.. పడక గదిలోకి వచ్చేసరికి ప్రశాంతంగా ఉండాలి. దాంపత్య జీవితం సంతోషంగా ఉన్నప్పుడు దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అందుకే శృంగార జీవితానికి ఎక్కడా తెరపడకుండా చూసుకోవాలి.