3 శాఖల మంత్రి కేటీఆర్ చుట్టూ భద్రతావలయం... ఎన్నికల ప్రణాళికలు పక్కాగా అమలు!
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి మంత్రి కె.తారక రామారావుకు భద్రతను మరింత పెంచారు. ఆయన ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి లేకుండా ఏ ఒక్కరినీ అనుమతించరాదనీ తెలంగాణ హోంశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లభించిన గెలుపుతో కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా మరో శాఖను కేటాయించిన విషయంతెల్సిందే. నిజానికి కేటీఆర్ ఇప్పటికే పంచాయతీ, ఐటీ శాఖలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. దీంతో కేటీఆర్కు భద్రతను పెంచారు.
మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై జీహెచ్ఎంసీ అధికారులు, పురపాలక శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్ ఆదాయంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని గాడిలో పెట్టాలంటే అధికార వికేంద్రీకరణ అవసరమన్నారు.
అధికారులు ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికోసం వంద రోజులు, మూడేళ్లు, ఐదేళ్లు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నాలాలు, దోమలు, తాగునీటి సమస్యలు నగరంలో తక్షణ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయన్నారు.