శ్వేతబసుకు ఊరట.. అమ్మ సంరక్షణలో ఉండాలని నాంపల్లి కోర్టు ఆదేశం!
ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్లోని ఒక హోటల్ రూమ్లో దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ గత కొంతకాలంగా హైదరాబాద్లోని రెస్క్యూ హోమ్లో ఆశ్రయం పొందుతోంది. ఈ నేపథ్యంలో శ్వేతబసును విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సినీనటి శ్వేతబసు ప్రసాద్ తల్లి వద్ద ఉండేందుకు అంగీకరించడంతో తల్లి సంరక్షణకు సినీనటి శ్వేతబసు ప్రసాద్ను అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమ కుమార్తెను బాగా చూసుకుంటామని, ఆమెను రెస్క్యూ హోంలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ శ్వేత తల్లి దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు.
తల్లితో వెళ్లేందుకు అంగీకారమేనా అంటూ శ్వేతను ప్రశ్నించడంతో ఆమె వెళ్లేందుకు అంగీకరించినట్లు డిఫెన్సు లాయరు చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితురాలిని బాధితురాలిగా చూడాలన్నారు.
శ్వేత, ఆమె తల్లి ఇద్దరి వాంగ్మూలం తీసుకున్న కోర్టు పిటీషన్ను ఆమోదించింది. సినీనటి శ్వేతబసుప్రసాద్ను చార్మినార్ వద్ద ఉన్న ఓ రెస్క్యూ హోంకు తరలిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.