సల్మాన్, షారూఖ్లా గడ్డం గీసుకోవాలట... భార్య టార్చెర్ భరించలేకపోతున్నా బాబోయ్.. కాపాడండి!
పాశ్చాత్య పోకడలు భారత దేశంపై బాగానే ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో భర్తను, పిల్లలను విదేశీ స్టైల్లో డ్రెస్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అలా చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ భార్య పెట్టే టార్చెర్
పాశ్చాత్య పోకడలు భారత దేశంపై బాగానే ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో భర్తను, పిల్లలను విదేశీ స్టైల్లో డ్రెస్ చేసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అలా చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ భార్య పెట్టే టార్చెర్ భరించలేక సాక్షాత్తు జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ యాదవ్కు ఆ భర్త ఫిర్యాదు చేసిన ఘటన మీరట్ పట్టణంలో చోటుచేసుకుంది.
స్మార్ట్ ఫోన్లలో వేరే మగాళ్లతో ఛాటింగ్, పిల్లలకు సంప్రదాయానికి విరుద్దంగా విదేశీ డ్రెస్సులు కొనిపెట్టడం.. భర్త షారూఖ్, సల్మాన్ ఖాన్లా గెడ్డం గీసుకోవాలని పట్టుబట్టిన ఆ మహిళకు భర్త నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వివరాల్లోకి వెళితే యూపీలోని మీరట్ పట్టణానికి చెందిన 36 ఏళ్ల అర్షద్ బద్రుద్దీన్ ఓ మసీదులో పేష్ ఇమాంగా పనిచేస్తున్నాడు.
అర్షద్ బద్రుద్దీన్ 2001లో హాపూర్ జిల్లా పిల్ఖువా పట్టణానికి చెందిన సహానాను పెళ్లాడాడు. ఈ దంపతులకు నలుగురు సంతానం. పెళ్లై నలుగురు పిల్లలు పుట్టాక తనను బాలీవుడ్ నటులు సల్మాన్ఖాన్, షారూక్ఖాన్లా శుభ్రంగా గెడ్డం గీసుకోవాలని, లేకుంటే పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంటానని 33 ఏళ్ల భార్య సహానా బెదిరిస్తుందని భర్త అర్షద్ బద్రుద్దీన్ సాక్షాత్తు జిల్లా మేజిస్ట్రేట్ పంకజ్ యాదవ్కు ఫిర్యాదు చేశారు.
తాను ఇస్లాం మతాన్ని పాటిస్తూ మసీదులో ఇమాంగా పనిచేస్తున్నానని, ఇస్లాం మతాచారానికి విరుద్దంగా తానెలా గెడ్డం గీసుకోవాలని అర్షద్ ప్రశ్నించారు. ఇంకా తన భార్య స్మార్ట్ ఫోన్లో రాత్రీ పగలూ ఇతర మగాళ్లతో ఛాటింగ్ చేస్తుందని.. ఆమెకు కౌన్సిలింగ్ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్కు అర్షద్ మొరపెట్టుకున్నారు. రంజాన్ ఈద్ పండుగ షాపింగ్కు వెళ్లి పిల్లలకు సంప్రదాయానికి విరుద్ధంగా విదేశీ దుస్తులు కొందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన భార్య ఇటీవల గదిలోకి వెళ్లి ఓ తాడు సాయంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకునేందుకు ప్రయత్నించిందని, తాను చూసి వెంటనే తన బంధువుల సాయంతో అతికష్టం మీద కాపాడానని జిల్లా మేజిస్ట్రేట్కు రాసిన లేఖలో అర్షద్ వివరించారు. భార్య బ్లాక్ మెయిలింగ్పై అర్షద్ రాసి ఫిర్యాదును సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు పంపించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర వెల్లడించారు.