సోమవారం, 10 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (12:02 IST)

తప్పుడు సర్టిఫికేట్‌తో హైకోర్టును చీట్ చేసిన బోరుగడ్డ.. రాష్ట్రం నుంచి పరార్!

Borugadda Anil Kumar
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టు అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్నే మోసంచేశారు. నకిలీ మెడికల్ సర్టిఫికేట్‌తో హైకోర్టు నుంచి బెయిల్ పొంది చివరకు రాష్ట్రం నుంచి పత్తా లేకుండా పోయాడు. ఈ రౌడీ షీటర్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు గమ్మతుగా సహకరించడం గమనార్హం. 
 
అనంతపురంలో నమోదైన కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ గత నెల 14వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో అదే నేల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కోర్టు మధ్యతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగిసిన తర్వాత గత నెల 28వ తేదీ సాయంత్రం ఆయన రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సివుంది. 
 
అయితే, మార్చి ఒకటో తేదీన బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు వేస్తూ మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని కోరాడు. తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, రెండు వారాల పాటు చికిత్స అవసరమని కాబట్టి మధ్యంతర బెయిల్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వాదనకు బలం చేకూరేలా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవర్మ ఇచ్చినట్టుగా ఓ మెడికల్ సర్టిఫికేట్‌ను సర్పించాడు. 
 
అయితే, పోలీసుల తరపున వాదనలు వినిపించిన ఏపీపీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు బోరుగడ్డ అనిల్.. సమర్పించిన వైద్య సర్టిఫికేట్‌లోని వాస్తవికతను నిగ్గు తేల్చేందుకు పోలీసులకు అనుమతిచ్చింది. ఒకవేళ తప్పుడు ధృవీకరణ పత్రం అని తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ మార్చి 11వ తేదీ వరకు బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
 
కానీ, పోలీసులు జరిపిన విచారణలో బోరుగడ్డ సమర్పించిన సర్టిఫికేట్ నకిలీదని తేలింది. బోర్డుగడ్డ తల్లి పద్మావతి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందడం నిజమే అయినా ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్టు గుర్చించారు. దీంతో సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా చెబుతున్న లలిత ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, తాము ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని, పద్మావతి తమ వద్ద చికిత్స పొందలేదని చెప్పారు. 
 
పద్మావతికి సంబంధించి తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. దీంతో తప్పుడు సర్టిఫికేట్‌తో కోర్టును మోగించిన అనిల్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కాగా, తప్పుడు సర్టిఫికేట్‍‌తో కోర్టును మోసగించిన బోరుగడ్డ ఎపుడు ఎక్కడ ఉంటున్నాడు.. ఏం చేస్తున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.