ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (09:01 IST)

ఏపీలో ఉచిత ఇసుక విధానం.. కానీ, ఆ చార్జీలు చెల్లించాల్సిందే...

sand reach
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త ఉచిత విధానం అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం కోసం సీఎం కార్యాలయంలో ఫైలు సిద్ధంగా ఉంది. ఈ ఫైలుపై సీఎం సంతకం చేయగానే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని గనుల శాఖ ఉన్నతాధికారులు అమలు చేయనున్నారు. అయితే, వినియోగదారుడు నిర్వహణ (ఆపరేషనల్) చార్జీలను వసూలు చేయనున్నారు. 
 
గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామంటూ టీడీపీ, జనసేన కూటమి హామీ ఇచ్చింది. ముగిసిన ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కొత్త ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో భాగంగానే ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
ఉత్తర్వుల ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం సీఎంవోకు పంపించారు. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇసుక మనుషులతో తవ్వి తీయించి, లారీల్లో లోడ్ చేయించి, తిరిగి డిపోలకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వానికి కొంత ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని వినియోగదారుడు చెల్లించాల్సివుంటుంది. అయితే, ఈ ఫీజులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా వసూలు చేస్తారు. ఇసుక రీచ్‌లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ నిర్వహణ చార్జీలను ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయిస్తారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో బీ1 కేటగిరీ ఇసుక రీచ్‌లే ఉన్నాయి. వీటిలో యంత్రాలను ఉపయోగించి ఇసుకను తవ్వరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చుతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఆపరేషనల్ ఫీజులను నిర్ణయించనున్నారు. గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక ధరలు మండిపోయిన విషయం తెల్సిందే. ఒక్క లారీ ఇసుక రూ.40 వేల వరకు విక్రయించిన వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా ప్రజలను దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఇపుడు కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయనుంది.