నిన్న కాక మొన్న వచ్చిన అఖిలప్రియకు అవకాశమిస్తారా? గంగుల ఫైర్
కర్నూలు: ఏపీలో టీడీపీలో భారీగా చేరిన వలసలు...ఇపుడు ఉద్రిక్తతలుగా మారుతున్నాయి. ఎప్పుడో వర్గాలు గా విడిపోయిన వారు ఇపుడు కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. దీని వల్ల అన్ని చోట్లా పంచాయతీలు పెరిగిపోతున్నాయి. వాటిని తీర్చడం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారుతోంది. కర్నూలు మినీ మహానాడులో ఇదే జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డిపై ఆళ్లగడ్డ నియోజక వర్గ ఇన్ఛార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మినీ మహానాడులో మొదట మాట్లాడడానికి తనకు అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కు అవకాశం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గంగుల ప్రభాకర్ రెడ్డి చిందులు తొక్కారు. నిన్నకాక మొన్న వచ్చిన అఖిల ప్రియకు ప్రయారిటీ ఇస్తున్నారని, సీనియర్లను తుంగలోకి తొక్కుతున్నారని ఆగ్రహం చెందారు. ఒక పద్దతి లేకుండా మినీ మహానాడు సభను ఎలా నాడుపుతారంటూ తీవ్ర నిరసన చేశారు గంగుల ప్రభాకర్ రెడ్డి. దీనితో కర్నూలు మినీమహానాడు రసాభాసగా మారింది.