శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (14:43 IST)

దళిత యువకుడితో వైశ్య యువతి ప్రేమ వివాహం.. కిడ్నాప్!

గుంటూరులో ఓ యువతి కిడ్నాప్‌కు గురైంది. ఆ యువతి చేసిన నేరం.. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. పైగా, ఆ యువతి వైశ్య కులానికి చెందిన యువతి. దీంతో ఆమె తల్లిదండ్రులు యువతిని కిడ్నాప్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన వైశ్య యువతి సౌమ్య, దళిత యువకుడు దిలీప్ ప్రేమించుకున్నారు. గత జూలై నెలలో వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. గుంటూరులో కాపురం పెట్టారు. 
 
పెళ్లైనప్పటి నుంచి వీరికి బెదిరింపులు వస్తున్నాయి. 'నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య గుర్తుందిగా... ప్రణయ్ మాదిరి హత్య చేస్తా'మంటూ యువతి తల్లిదండ్రులు తనకు వార్నింగులు ఇస్తూ బెదిరించారని చెప్పాడు.
 
అంతేకాదు పోలీసులతో తనను బెదిరింపజూశారని, ఆ తర్వాత ఇంట్లో ఉన్న తన భార్యను కిడ్నాప్ చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన తల్లిని కొట్టారని ఆ యువకుడు తెలిపాడు. దీంతో, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి అతను ఫిర్యాదు చేశాడు. 
 
తాజాగా జరిగిన ఈ ఘటన గుంటూరులో కలకలం రేపుతోంది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.