శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2024 (21:15 IST)

భారీ వర్షానికి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బీభత్సం, ముగ్గురు మృతి (Video)

Man in flood
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలోని మొగల్రాజపురం వద్ద కొండచరియలు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్నిశాఖలు సహకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికపుడు అలెర్ట్ మెసేజ్‌లు పంపించాలని కోరారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రజల ప్రమాదాల బారిన పడుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.