భార్య మెడను బ్లేడుతో కోసి చంపేసిన కసాయి భర్తకు యావజ్జీవం
పరాయి మహిళతో ఉన్న వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతోందని భావించి భార్య మెడను బ్లేడుతో కోసి హత్య చేసినందుకు కేసులో భర్తకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...
హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని భోళానగర్కు చెందిన ఫిరోజ్ఖాన్ ఆటో డ్రైవర్. వివాహం అయిన కొద్ది కాలానికి భార్య ఫాతిమాబేగానికి విడాకులు ఇచ్చాడు. పెద్దల జోక్యంతో తిరిగి ఒక్కటయ్యారు. అయితే, ఫిరోజ్ఖాన్కు గోల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం భార్య ఫాతిమాకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎలాగైనా భార్యను అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్న ఫిరోజ్ఖాన్ 2012, మార్చి 30వ తేదీ తెల్లవారు జామున నిద్రలో ఉన్న ఫాతిమా మెడను బ్లేడ్తో కోశాడు. తన తల్లిని తండ్రి హత్య చేయడాన్ని ఏడేళ్ల కుమార్తె కళ్లారా చూసింది. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. వాదోపవాదాలు విన్న నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రజని ఫిరోజ్ఖాన్కు యావజ్జీవశిక్ష విధించారు. ఈ కేసులో కుమార్తె ఇచ్చిన సాక్ష్యమే ప్రధానంగా మారింది.