వారి గొయ్యి వారే తవ్వుకున్నారు...! మంత్రి రావెల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్లు ఫోన్ ట్యాపింగ్ అంశంలో వారి గొయ్యి వారే తవ్వుకున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఘాటుగా స్పందించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్, కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు.
గురువారం ఆయన మట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి జరిగితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని కేసీఆర్కు భయం ఆవహించిందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజకీయ భవిష్యత్ ఉండదని జగన్కు భయం పట్టుకుందని అన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు ఇచ్చిన నివేదికతో జగన్లోనూ, కేసీఆర్లోనూ భయం నెలకొందని తెలిపారు.
కుట్ర ఫలితంగా జగన్, కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలిపోబోతోందన్నారు. జగన్, కేసీఆర్ తమ గొయ్యి తామే తవ్వుకున్నారని రావెల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.