ఇంతకంటే న్యాయం చేయాలంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండాలి : వెంకయ్య
తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తనకు తెలిసినంత వరకు రైల్వే బడ్జెట్లో ఏపీకి న్యాయం చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
రైల్వే బడ్జెట్లో చప్పగా ఉందనీ, తీవ్ర నిరాశను మిగిల్చిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. దక్షిణ మధ్య రైల్వేకు గత సంవత్సరం కంటే 25 శాతం అధికంగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు.
అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉండాలన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ పేరును త్వరలో తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చనున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు విప్లవాత్మకమైనవిగా అభివర్ణించిన వెంకయ్య దానివల్ల ఏపీకి ఎంత మేలు జరుగుతుందో భవిష్యత్లో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.