1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి... కార్యకర్తల కోలాహలం

election commission of india
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఆయా పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది.
 
మంగళవారం ఏపీలోని పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, గుడివాడ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్‌ దాఖలు చేశారు. ధర్మవరం అభ్యర్థిగా సత్యకుమార్‌ (భాజపా), చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ), నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి (వైకాపా) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. 
 
అలాగే, తెలంగాణలో పలువురు లోక్‌సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చేవెళ్ల స్థానం నుంచి రంజిత్‌ రెడ్డి (కాంగ్రెస్‌), కాసాని జ్ఞానేశ్వర్‌ (భారాస) నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు. నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి (కాంగ్రెస్‌) నామపత్రాలను సమర్పించారు. ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ నేత రఘురాంరెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందించారు. అయితే ఖమ్మం స్థానంలో అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 
 
వేలాది మంది తరలిరాగా... పిఠాపురం జనసేన అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు! 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ వెంట భారీ సంఖ్యలో ఆయన అభిమానులు, మద్దతుదారులు, పిఠాపురం వాసులు పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈ ర్యాలీలో కనీసం 70 నుంచటి 80 వేల మంది పాల్గొన్నట్టు అంచనా. దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు లాంఛనమేనని పిఠాపురం వాసులు చెబుతున్నారు.