ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (08:31 IST)

ఇండోపాక్ సరిహద్దులను తలపిస్తున్న "ఏపీ సీఎంవో" పరిసరాలు

iron thorn in ap cmo
సాధారణగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటాయి. దీంతో ఇరు దేశాలు సరిహద్దుల్లో ఇనుప ముళ్ళ కంచెలు వేసివుంటారు. కానీ, ఇపుడు ఇదే దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కార్యాలయమైన సీఎంవో వద్ద కనిపిస్తున్నాయి. 
 
సీఎంవో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దాని చుట్టూత ముళ్ల కంచెను వేశారు. దీనికి కారణం లేకపోలేదు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయల సంఘాలు ఛలో సీఎంవో (పోరు గర్జన)కు సోమవారం పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అలాగే పోలీసు యాక్ట్ 30ని కూడా అమలు చేస్తున్నారు.
 
పైగా, పోలీస్ ఆంక్షలను కాదని ఎవరైనా ఛలో సీఎంవోకు వస్తే మాత్రం క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఛలో సీఎంవో దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్, సీఎంవో ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సుమారుగా 800 మందికిపై పోలీసుల బలగాలను మొహరించారు.