1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (19:39 IST)

జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్టు బాదారు.. ఎక్కడ?

కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఒక్కో సందర్భంలో ఇవి శృతిమించడంతో వైద్య సిబ్బంది ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న సంఘటనలు వార్తల్లో వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాంలోని హోజాయ్ జిల్లాలో ఓ జూనియర్ డాక్టర్‌ను గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనాతో మృతి చెందిన రోగి బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. 
 
డాక్టర్ సియూష్ కుమార్ సేనాపతి హోజాయ్‌లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ బంధువు ఈ డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా దాడి జరగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో డాక్టర్ ఉండిపోయారు.
 
ఈ దాడిలో మొత్తం 24 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వారిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆయన ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ ఘటనపై అస్సాం ఐఎంఏ విభాగం ఆందోళనకు దిగింది. ఔట్ పేషెంట్ సర్వీసులను నిలిపివేసి నిరసన తెలిపారు.